common recruitment board: తెలంగాణ వర్సిటీల చాన్సలర్ ను మార్చే ప్రయత్నం జరుగుతుందా?

by Disha edit |
common recruitment board: తెలంగాణ వర్సిటీల చాన్సలర్ ను మార్చే ప్రయత్నం జరుగుతుందా?
X

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వీసీల నియామాకాలలో అనేక అవకతవకలు జరిగాయని దాదాపు అన్ని వర్సిటీల నియామకంపై హైకోర్టులో కేసులు దాఖలయ్యాయంటే నియామకాలు ఎంత రాజకీయ పక్షంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా నియామకమైన వారు వర్సిటీలలో సమస్యలు పట్టించుకోకపోవడంతో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయనే విమర్శ ఉద్యోగ, విద్యార్థి సంఘాలలో కనబడుతుంది. అందుకే గవర్నర్ కామన్ బోర్డు బిల్లు విషయంలో స్పష్టత కోరడం సరైనదే అని వర్సిటీ మేధావుల అభిప్రాయం. కానీ, పెండింగ్ లో ఉంచారనే కారణంతో గవర్నర్ ను చాన్సలర్ పదవీ నుండి తీసి వేసే ప్రయత్నం బాధకరం. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ కు, ప్రభుత్వానికి పొసగడం లేదు. గవర్నర్ రాష్ట్రంలో ఏ సమస్య ఎదురైనా ప్రభుత్వం కంటే ముందుగా స్పందిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కక్షగట్టి రాష్ట్రంలో గవర్నర్ పాత్రను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేయడం సిగ్గుమాలిన చర్య.

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు చాన్సలర్ గా వ్యవహరిస్తున్న గవర్నర్ స్థానంలో ముఖ్యమంత్రిని నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. రాష్ట్రంలోని వర్సిటీ విషయాలలో గవర్నర్ తమిళిసై(Tamilisai Soundararajan) ప్రత్యక్ష జోక్యం లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ గుత్తాధిపత్యం పూర్తిగా ప్రభుత్వం నిర్వహించే విధంగా చర్యలకు ఉపక్రమించింది.

ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ వర్సిటీలలో ఎన్నో సమస్యలున్నప్పటికీ వాటిని సరి చేయకుండా ఇష్టారాజ్యంగా నియంతృత్వ విధానాలకు పాల్పడి ఉన్నత విద్యను దూరం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. అయినా, ప్రభుత్వం వర్సిటీల విషయంలో మొండి పట్టుదలతో పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు ఇటీవల వర్సిటీలకు చాన్సలర్ గా రాష్ట్ర ముఖ్యమంత్రులను నియమించుకున్నట్టు తెలంగాణలో కూడా నియమించుకోవాలనే ప్రయత్నం ప్రారంభం కావడాన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఆ నమ్మకం పోయే ప్రమాదం

తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 15 వర్సిటీలలో కొన్నేళ్లుగా ఖాళీగా వున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కొరకు కామన్ రిక్రూట్ మెంట్(common recruitment board) బోర్డును రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లో ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్(governor) ఆమోదం కోసం పంపారు. కానీ, గవర్నర్ తమిళిసై ఈ నియామక బిల్లులోని వాస్తవాలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులతో చర్చించడంతోపాటు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC) నుంచి ఒక స్పష్టమైన నివేదిక అవసరమని సూచించారు. దీంతో ఈ బిల్లు ఆమోదం కాకుండా ఇంకా పెండింగ్ లో వుంది. అయితే, వర్సిటీ టీచర్ల నియామకం కోసం కామన్ బోర్డును ఏర్పాటు చేయడం యూజీసీ 2018 నిబంధనలకు విరుద్ధమని తెలిసినా, ఆ నియామకాన్ని రాజకీయ కారణాలతో గవర్నర్ అడ్డుకుంటున్నారనడం సబబు కాదని. నిజానికి ప్రభుత్వానికి టీచింగ్ పోస్టుల నియామకం చేపట్టే చిత్తశుద్ధి లేదని మేధావి వర్గాల అభిప్రాయం.

వర్సిటీ టీచర్ల నియామకంలో పూర్తి పెత్తనం రాష్ట్ర ప్రభుత్వం వహించే విధంగా యూజీసీ నిబంధనలకు, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సిఫార్సులకు వ్యతిరేకంగా కామన్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంటే, వర్సిటీలకు కులపతిగా వున్న గవర్నర్‌ను తీసివేసి ముఖ్యమంత్రి కులపతిగా(chancelor) ఉండేలా కొత్త చట్టం తీసుకురావాలనే కుట్ర జరుగుతుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కులపతి విషయంలో ఈ నిర్ణయం తీసుకుంటే విద్యా వ్యవస్థ పూర్తిగా రాజకీయం చేస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో అకాడెమిక్ మెరిట్ కలిగిన వారు వర్సిటీలలో కొనసాగుతారనే నమ్మకం పోయే ప్రమాదం పొంచి వుంది. ఎందుకంటే దాదాపు రెండేళ్లుగా ఖాళీగా ఉన్న పది వీసీలను ఏడాదిన్నర కిందట భర్తీ చేసిన ప్రభుత్వం వీరి జాబితా పక్కన ఎన్నడూ లేనివిధంగా విద్యార్హతలు, అకడమిక్ అనుభవం కాకుండా సామాజిక వర్గాల వారీగా ప్రకటించడం గమనించదగ్గ విషయం.

బకాయిలు ఇవ్వకుండా

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వీసీల నియామాకాలలో అనేక అవకతవకలు జరిగాయని దాదాపు అన్ని వర్సిటీల నియామకంపై హైకోర్టులో కేసులు దాఖలయ్యాయంటే నియామకాలు ఎంత రాజకీయ పక్షంగా జరిగాయో అర్థం చేసుకోవచ్చు. ఇలా నియామకమైన వారు వర్సిటీలలో సమస్యలు పట్టించుకోకపోవడంతో సమస్యలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయనే విమర్శ ఉద్యోగ, విద్యార్థి సంఘాలలో కనబడుతుంది. అందుకే గవర్నర్ కామన్ బోర్డు బిల్లు విషయంలో స్పష్టత కోరడం సరైనదే అని వర్సిటీ మేధావుల అభిప్రాయం. కానీ, పెండింగ్ లో ఉంచారనే కారణంతో గవర్నర్ ను చాన్సలర్ పదవీ నుండి తీసి వేసే ప్రయత్నం బాధకరం. ప్రస్తుతం రాష్ట్రంలో గవర్నర్ కు, ప్రభుత్వానికి పొసగడం లేదు. గవర్నర్ రాష్ట్రంలో ఏ సమస్య ఎదురైనా ప్రభుత్వం కంటే ముందుగా స్పందిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కక్షగట్టి రాష్ట్రంలో గవర్నర్ పాత్రను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేయడం సిగ్గుమాలిన చర్య.

యూజీసీ నిబంధనలకు విరుద్దంగా జీఓలను ఇస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొఫెసర్లు ఎన్నోసార్లు ఆందోళన తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఫలితంగా వర్సిటీలలో ప్రొఫెసర్లు లేక ఆ కోర్సులు రద్దు అవుతున్నాయి. పదవీ విరమణ పొందిన ప్రొఫెసర్లకు రావాల్సిన బకాయిలు చెల్లించలేని దుస్థితిలో వర్సిటీలు ఉన్నాయి. ప్రభుత్వం వర్సిటీలకు తగినంత గ్రాంట్ ఇవ్వకుండా ప్రైవేటు వర్సిటీలను ప్రోత్సహించడం ప్రభుత్వ విధానాలకు సరికాదని అధ్యాపక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే వర్సిటీలలో ప్రభుత్వం జోక్యం లేకుండా వర్సిటీలకు రావాల్సిన నిధులు సమకూరుస్తూ విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన అందించాల్సిన అవసరం ఉంది. అలాగే వర్సిటీ చాన్సలర్ గా ఉన్న గవర్నర్ ను పదవి నుంచి తప్పించి ముఖ్యమంత్రి నియామకం అయ్యే ప్రయత్నం మానుకొని విద్యార్థి లోకానికి అండగా ఉండాలని మేధావి వర్గం కోరుకుంటుంది.


డా. మామిడాల ఇస్తారి

కేయూ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి

98483 09231

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.

Also Read....

BRS పొలిట్‌‌‌బ్యూరో.. రాష్ట్రం నుంచి వీరికే అవకాశం?

Next Story

Most Viewed